తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని త్రిపురాంతకం, వెలిగండ్ల, కనిగిరి, టీవీ పల్లి, రాచర్ల, సియస్ పురం తదితర పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాస్ గోదాములను తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో సంబంధిత రెవెన్యూ అధికారులు, సీఐలు, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్యాస్ గోదాములలో అమలు చేస్తున్న భద్రతా చర్యలు, అగ్నిమాపక సదుపాయాలు, తగినంత నీటి వసతి, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే ఏర్పాట్లు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
అదేవిధంగా, గ్యాస్ సిలిండర్ల నిల్వ, సరఫరా విధానాలు, రవాణా సమయంలో పాటించాల్సిన భద్రతా నిబంధనలు మరియు సంబంధిత రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. గోదాముల యజమానులు మరియు నిర్వాహకులకు చట్టపరమైన నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా కొనసాగించాలని, నిల్వలకు సంబంధించిన అన్ని రికార్డులను సక్రమంగానిర్వహించాలని, ఎటువంటి అక్రమ రవాణా, అవకతవకలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన అన్ని రక్షణ చర్యలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీస్ వారి దృష్టికి తీసుకొని రావాలని సూచించారు…..