తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక పథకం ‘ప్రధానమంత్రి సూర్యఘర్’ను కందుకూరు మండలం కోవూరు ఎస్సీ కాలనీలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించాను. గ్రామంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల ఇళ్లలో సోలార్ పవర్ స్విచ్ ఆన్ చేయడం ద్వారా ఈ నూతన విప్లవానికి శ్రీకారం చుట్టాము. మన నియోజకవర్గవ్యాప్తంగా దాదాపు ₹225 కోట్ల భారీ వ్యయంతో 18,830 మంది అర్హులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చబోతున్నాం. మొదటి విడతలో భాగంగా 2,619 ఇళ్లకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నాం.ఈ పథకం ద్వారా ఒక్కో ఇంటికి ₹1.20 లక్షల ఖర్చుతో 2 కిలోవాట్ల కెపాసిటీ గల సోలార్ ప్యానెల్స్ మరియు బ్యాటరీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీని కోసం లబ్ధిదారులు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, రాబోయే పాతికేళ్ల పాటు ఈ సోలార్ సిస్టం నిర్వహణ బాధ్యతను కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది. సొంత భవనం ఉండి, నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే ప్రతి పేద కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. కందుకూరు మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నాం.బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించి, ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశాం. పర్యటనలో ప్రజల నుంచి అందిన అర్జీలను పరిశీలించి, వారి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చాను. అలాగే, కందుకూరు మండల ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు ₹30 కోట్లతో రామతీర్థం నీటి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధి బాటలో కందుకూరును అగ్రగామిగా నిలిపేందుకు నేను ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాను.