తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం/ తూర్పు నాయుడు పాలెం, :-
వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. గురువారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….వేసవిలో గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే సమస్య పరిష్కరించాలి. చెడిపోయిన బోరు మోటార్లను వెంటనే బాగు చేయాలి, అవసరమైతే కొత్త వాటిని ఏర్పాటు చేయాలి. పైపులైను లీకులపై దృష్టి సారించి వెంటనే మరమ్మతులు చేయాలి. నియోజకవర్గానికి మంజూరైన SDS కింద రూ. 6 కోట్ల 15 లక్షల వినియోగంపైనా మంత్రి సమావేశంలో చర్చించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేలా, తాగునీటి ఎద్దడి రాకుండా ముందుగానే తగిన ప్రణాళిక రూపొందించి దానికనుగుణంగా అధికారులు పనిచేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.