తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ సీఐ యు.సుధాకర్ గారి ఆధ్వర్యంలో బుధవారం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రజలకు మరియు యువతకు మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ షేక్ మహబూబ్ బాషా, ఈగల్ టీం సభ్యులు పాల్గొని మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, సంబంధిత చట్టాలు, విధించే శిక్షలపై వివరించారు.యువత సరదా కోసం ప్రారంభించే గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వ్యసనాలు వారి జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయో స్పష్టంగా తెలియజేశారు. వ్యసనాలకు బానిసైన వ్యక్తులు డబ్బు కోసం దొంగతనాలు చేయడంతో పాటు ఇతర నేరాలకు పాల్పడే అవకాశముంటుందన్నారు. మాదక ద్రవ్యాల రవాణా మరియు విక్రయాలపై పోలీసులు నిఘా ఉంచి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి సారించి, వారు చెడు మార్గాల్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సూచించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా ధూమపానం చేస్తున్న ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. అలాగే డార్మిటరీలను కూడా తనిఖీ చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల పరిసరాల్లో పోలీసు నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.