తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేర నియంత్రణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ప్రకాశం పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఒంగోలు వన్ టౌన్ పరిధిలోని ఏకలవ్య నగర్, వంటవారి కాలనీ, పొన్నలూరు ఎస్సీ కాలనీ, మేదరమెట్ల గాంధీ నగర్ కాలనీలలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ (CASO) ఆపరేషన్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల సి.ఐ.లు మరియు ఎస్.ఐ.ల ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసు సిబ్బంది ఏకకాలంలో ఇళ్లలో సోదాలు నిర్వహించారు.ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలు, వాడకంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ తనిఖీల్లో ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ డివైస్ (Fingerprint Identification Device) ఉపయోగించి పాత నేరస్థులు మరియు అనుమానితుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని, నంబర్ ప్లేట్లు లేని వందలాది మోటార్ సైకిళ్లు మరియు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు, కొత్త చట్టాలు మరియు మహిళా భద్రతపై దిశానిర్దేశం చేశారు. గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని అధికారులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో అసాంఘిక శక్తులకు తావులేకుండా నిరంతరం ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
