పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు, అధికారులతో జిల్లా ఇన్చార్జి మంత్రి డిఎస్ బీవీ స్వామి సమీక్ష
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మహత్తర కార్యక్రమం
సీఎం చంద్రబాబు పర్యటనను సమన్వయంతో విజయవంతం చేద్దాం
మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ విశాఖ :-
ఈ నెల 19వ తేదీన విశాఖపట్టణం వేదికగా జరిగే పలు కార్యక్రమాలను, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి వర్చ్యువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని, అర్హులైన వారందరికీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలు అందజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల నుంచి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో తెలుసుకొని వారికి ముందుగానే ఆహ్వాన పత్రాలు అందజేయాలన్నారు. ఆ సమయంలోనే వారు వేదిక వద్దకు ఎలా చేరుకోవాలి, వారికి ఏ గ్యాలరీ కేటాయించామో తెలియజేయాలని చెప్పారు. నిర్ణీత సమయానికి అందరూ చేరుకునేలా.. ప్రతి ఒక్కరికీ ఆహ్లాదకర వాతావరణంలో పట్టాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు.
26,426 మందికి ఇళ్ల స్థల పట్టాలు, కన్వేయన్స్ డీడ్స్ అందజేత ః జిల్లా కలెక్టర్
విశాఖపట్నం జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థల పట్టాలు, కన్వేయన్స్ డీడ్స్ పంపిణీకి సంబంధించి మొత్తం 26,426 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పంపిణీకి సంబంధించిన లైన్ లిస్టింగ్ను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా భీమిలి 4,198, గాజువాక 5,597, పెందుర్తి 2,896, విశాఖ తూర్పు 5,107, విశాఖ ఉత్తరం 2,425, విశాఖ దక్షిణం 1,228, విశాఖ పశ్చిమం 4,975 మంది లబ్ధిదారులు ఉన్నట్లు వివరించారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే కార్యక్రమంలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికీ ఇళ్ల స్థలం, సంబంధిత హక్కు పత్రాలు అందేలా యంత్రాంగం తరఫున చర్యలు చేపట్టామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆర్కే బీచ్ పరిసరాల్లో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర అలాగే అదే రోజు బీచ్ రోడ్లో సాగర స్వచ్ఛత పేరుతో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుగుతుందని, దానిలో భాగంగా ఇన్కాయిస్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన నిర్మల్ సాగర్ పైలెట్ ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. నిర్మల్ సాగర్ కార్యక్రమంలో భాగంగా బీచ్ క్లీనింగ్, సముద్ర వ్యర్థాల రీసైక్లింగ్, ఉపాధి కల్పన తదితర కార్యాచరణ మార్గాలు ఉంటాయన్నారు. దీనిలో కేంద్ర కార్యదర్శితో పాటు, యూఎన్డీపీ ప్రతినిధులు భాగస్వామ్యం కానున్నారని వివరించారు. అయితే సాసా కార్యక్రమం వేదిక ఇంకా ఫైనల్ కాలేదని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. బీచ్ రోడ్ తో పాటు, గాజువాకలో ఆర్.డబ్ల్యు.ఎస్. ఆధ్వర్యంలో కొనసాగుతున్న టెర్రాస్ కల్చర్, వాన నీటి నిర్వహణ, నరవలోని మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ నిర్వహణ తదితర అంశాలు పరిశీలనలో ఉన్నట్లు స్పష్టం చేశారు.కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎంపీ శ్రీ భరత్, ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, ఇతర ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్యారోగ్య సేవా ట్రస్ట్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ జి. విద్యాధరి, డీసీపీ మేరీ ప్రశాంతి, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.