తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / మద్దిపాడు:-
రాజసానికి, పౌరుషానికి మారుపేరుగా నిలిచి భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పిన ఒంగోలు జాతి గిత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం మద్దిపాడు మండలం దొడ్డవరం (తెల్లపాడు)లో జరిగిన జాతీయస్థాయి ఒంగోలు జాతి బల ప్రదర్శన ఎడ్ల పోటీలకు మంత్రి స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ….. మన ప్రాంతంలో పుట్టిన ఒంగోలు జాతి గిత్తలు మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మేలు జాతిగా గుర్తింపు పొంది మన ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిందన్నారు. ఒంగోలు జాతి జాతీయస్థాయి ఎడ్ల పోటీలు ఇక్కడ నిర్వహించడం అభినందనీయమన్నారు. బల ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా ఒంగోలు జాతి పశువులను పశుపోషకులు ఉత్సాహంగా పశుసంపదను పెంచుతారన్నారు. పశువులు ప్రతి రైతు జీవితంలో ఒక భాగం అన్నారు. ఇది కేవలం బల ప్రదర్శన కాదని ఒంగోలు జాతి పశు సంపదకు, రైతులకు ప్రోత్సాహకమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు సంతనూతలపాడు, కనిగిరి ఎమ్మెల్యేలు బి.ఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.