తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
హైవేలపై రాత్రివేళల్లో జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ‘Face Wash & Go’ పేరుతో అమలు చేస్తున్న ఈ వినూత్న కార్యక్రమం ద్వారా నిద్రమత్తు మరియు అలసటతో వాహనాలు నడిపే డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నారు.
జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో అర్ధరాత్రి 1 గంట నుండి తెల్లవారుజామున 4:30 గంటల వరకు జాతీయ, రాష్ట్ర రహదారులపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో హైవేలపై వెళ్తున్న వాహనాలను ఆపి డ్రైవర్లకు ముఖం కడుక్కునే సదుపాయం కల్పిస్తూ, టీ అందించి వారిలో మళ్లీ చైతన్యం కలిగిస్తున్నారు.డ్రైవర్లు తమ ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించడమే కాకుండా, వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యుల భద్రత కూడా ముఖ్యమని పోలీసులు గుర్తుచేస్తున్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం, అప్రమత్తంగా ఉండడం వల్ల ఎన్నో ప్రాణాలను రక్షించవచ్చని అవగాహన కల్పిస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా రాత్రివేళల్లో జరిగే రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఇలాంటి వినూత్న చర్యలను నిరంతరం కొనసాగిస్తామని ప్రకాశం మరియు మార్కాపురం పోలీసులు స్పష్టం చేశారు