గుడ్లూరు మండలం చెమిడిదపాడు గ్రామంలో కలెక్టర్ రాజాబాబు గురువారం రాత్రి పల్లెనిద్ర నిర్వహించారు. గ్రామస్తులతో సమావేశమై… రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.కలెక్టర్ తోపాటు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి గారు, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు, సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ గారు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించారు.
శుక్రవారం ఉదయాన్నే కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు గ్రామంలో కాలినడకన తిరిగి మౌలిక వసతులను పరిశీలించడంతోపాటు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చెత్త సేకరణ, ఓవర్ హెడ్ ట్యాంకు, పంట కాలువలు, ఉపాధి హామీ పథకం పనులు, అసంపూర్తిగా ఉన్న స్కూల్ భవనం, అంగన్వాడీ కేంద్రం, ఎలికేరు వాగును వారు పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు సమీపంలో ఎలికేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరారు. అలాగే గ్రామం మధ్యలో గుండా వెళ్లే పంట కాలువలను కాంక్రీట్ తో నిర్మించాలని కోరారు. 50 సంవత్సరాల నుంచి అటవీ భూముల్లో ఇళ్లు కట్టుకుని ఉంటున్నామని, తమకు ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించాలని ఎస్సీ, ఎస్టీ కాలనీల వాసులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ రాజాబాబు హామీ ఇచ్చారు. MLA నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ…. సమస్యలు తెలుసుకోవడం, వాటి పరిష్కారమే లక్ష్యంగా నియోజకవర్గంలో ఇప్పటివరకు నాలుగు మండలాల్లో పల్లెనిద్ర కార్యక్రమం జరిగిందని చెప్పారు. కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టితో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. 25 లక్షలతో చెమిడిదపాడు చెరువును అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్లికార్జున, మండల టిడిపి అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, గ్రామటిడిపి అధ్యక్షుడు వర్ధినేని వెంకటరావు, క్లస్టర్ ఇంచార్జ్ చిత్తారి మల్లికార్జున, గ్రామ నాయకులు కారసాల శ్రీను, రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడు కారసాల బ్రహ్మనాయుడు, చిత్తారి శ్రీను, మండల స్థాయి నేతలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *