తొలి శుభోదయం న్యూస్ కంభం :-
మార్కాపురం జిల్లా కంభం మండలంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన విద్యార్థుల ఆరోగ్య పరీక్షలను ఎంఈవో అబ్దుల్ సత్తార్ పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న ఆరోగ్య పరీక్షల తీరును పరిశీలించిన ఆయన, విద్యార్థుల ఆరోగ్య వివరాలను నమోదు చేస్తున్న తీరుపై ఆరా తీశారు. విద్యార్థుల ఎత్తు, బరువు, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తదితర ఆరోగ్య వివరాలను వైద్య సిబ్బంది పరీక్షించి నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన వైద్య సలహాలు, చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని తెలిపారు.అనంతరం విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అంశాలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.