తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
గణేష్ చవితి ఉత్సవాల సందర్భంగా జరిగే విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీ ఎన్. యుగంధర్ బాబు గారు మరియు ఒంగోలు 2 టౌన్ సీఐ గారు కొత్తపట్నం, ఈతముక్కల – మడనూరు బీచ్లను సందర్శించి నిమజ్జన ప్రాంతాల్లో చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా బీచ్లలో ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, పోలీసు పికెట్లు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ సౌకర్యాలు, అత్యవసర సేవలు, ప్రజల రాకపోకల నియంత్రణ వంటి అంశాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. నిమజ్జన కార్యక్రమాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని ఆదేశించారు.సముద్ర తీర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు లోతుగా వెళ్లకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.గణేష్ నిమజ్జనాల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా, ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను జరుపుకునేలా ప్రకాశం జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తుతో సిద్ధంగా ఉన్నారు.“భక్తుల భద్రతే మా ప్రాధాన్యం… ప్రశాంతమైన గణేష్ నిమజ్జనాలే మా లక్ష్యం.”