తొలి శుభోదయం ప్రకాశం :-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ,రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాలను తగ్గించడమే ముఖ్య లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు దద్దాలమ్మ దేవాలయం సెంటర్‌లో హెల్మెట్ వినియోగంపై విస్తృత రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, తల గాయాల తీవ్రత, అలాగే హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చో వివరంగా అవగాహన కల్పించారు. హెల్మెట్ కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా, వ్యక్తిగత భద్రతకు అత్యంత అవసరమైన రక్షణ సాధనమని పోలీసులు తెలిపారు.అదేవిధంగా, అధిక వేగం, తప్పు దిశలో వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర అలవాట్లపై కూడా ప్రజలకు సూచనలు ఇచ్చారు. రోడ్డు నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను ముందస్తుగా నివారించవచ్చని వివరించారు.ఈ సందర్భంగా ప్రజలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, తమ కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.ప్రజల ప్రాణ భద్రతే పరమావధిగా ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం రోడ్డు భద్రతపై ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుందని తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *