తొలి శుభోదయం కందుకూరు:-

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు ఎస్ కే పి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గుంతకల్లు వారి సహకారంతో, పీఎం ఉష కార్యక్రమం ఆర్థిక సహకారంతో డ్రోన్ పైలెట్ టెక్నాలజీ మరియు భూసార పరీక్షల నిర్వహణ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించే సర్టిఫికెట్ కోర్సులను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవికుమార్, ఇటువంటి కార్యక్రమాన్ని తమ కళాశాలలో ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించినందుకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ నారాయణ భరత గుప్తాకు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గుంతకల్లు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఐదు రోజులు జరుగుతుందని, తమ విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కృషి విజ్ఞాన కేంద్రం, కందుకూరు శాస్త్రవేత్తలు డాక్టర్ జ్యోతి మరియు డాక్టర్ వివేక కామత్ మాట్లాడుతూ డ్రోన్ టెక్నాలజీ నేటి వ్యవసాయంలో ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలియజేశారు. పెరుగుతున్న జనాభా యొక్క అవసరాలకు తగ్గట్టుగా దిగుబడి వచ్చే విధంగా పంటలను పండించుకోవాలని వారు విన్నవించారు. ఎరువులు మరియు క్రిమిసంహారక మందులు పిచికారికి కూడా డ్రోన్లను ఉపయోగించుకోవచ్చని వారు తెలియజేశారు. ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ ప్రతినిధులు ప్రతాప్, ప్రవీణ్, నరేష్ మరియు రోహిణి తదితరులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐదు రోజులు పాటు ఈ సర్టిఫికెట్ కోర్స్ జరుగుతుందని వారు తెలిపారు. కళాశాల కంప్యూటర్ సైన్స్ మరియు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో డ్రోన్ పైలెట్ శిక్షణ కార్యక్రమం మరియు వృక్ష శాస్త్రం, రసాయన శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో భూసార పరీక్షల శిక్షణా కార్యక్రమం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఎన్వి. శ్రీహరి, జె. హనుమంతరావు, డాక్టర్ ఎన్. తిరుపతి స్వామి, శ్రీ బి. కమల బాబు, కె వి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *