తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒంగోలు నుండి ముందుకు సాగిన సీఐఎస్ఎఫ్ జవాన్లు చేపట్టిన సైకిల్ ర్యాలీ
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-
దేశ శాంతి భద్రతల పరిరక్షణలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) కీలకమైన పాత్ర పోషిస్తున్నదని, సురక్షిత తీరం, తీర ప్రాంతాల పరిరక్షణతో పాటు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్ – 2026 పేరిట చేపట్టిన ఈ సైకిల్ యాత్ర, తొమ్మిది రాష్ట్రాల్లో 6,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఈ ర్యాలీని జనవరి 28వ తేదీన కోల్కతా నుంచి ప్రారంభించి, కేరళ రాష్ట్రం కొచ్చి వరకు కొనసాగించి ఫిబ్రవరి 23వ తేదీన ముగించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, ఎన్సీసీ విద్యార్థులు సీఐఎస్ఎఫ్ జవాన్లకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ శ్రీ సంజీత్ కుమార్ గారు మాట్లాడుతూ, 100 మందికి పైగా సైకిలిస్టులతో ఈ సైకిల్ ర్యాలీని నిర్వహిస్తున్నామని తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల రక్షణతో పాటు, దేశంలోని యువత మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఎదుర్కొనే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సైకిల్ ర్యాలీని ప్రతిరోజూ సుమారు 150 నుంచి 160 కిలోమీటర్ల మేర కొనసాగిస్తున్నామని, సీఐఎస్ఎఫ్ సిబ్బంది తమ ధైర్య సాహసాలు, క్రమశిక్షణతో ర్యాలీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని వివరించారు. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు తీర భద్రత ప్రాధాన్యత, దేశ రక్షణలో వారి పాత్ర, భద్రతా దళాలకు వారు అందించవలసిన సహకారం గురించి ఈ ర్యాలీ ద్వారా వివరించబడుతోందన్నారు. దేశ భద్రతలో కోస్టల్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యత ఉందని, అందుకు ప్రజల సంపూర్ణ సహకారం అవసరమన్నారు. వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాతృభూమి రక్షణ, దేశం కోసం త్యాగాలు చేయాల్సిన బాధ్యత వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ సైకిల్ యాత్రను చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు 14 రోజులుగా నిరంతరంగా సైకిల్ ర్యాలీ కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ర్యాలీలో మహిళా జవాన్లు కూడా ఉత్సాహంగా పాల్గొంటుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ సంజీత్ కుమార్, అసిస్టెంట్ కమాండెంట్ విక్రమ్ సింగ్, ఎస్బి డిఎస్పి చిరంజీవి, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ, ఒంగోలు ట్రాఫిక్ సీఐ జగదీష్,ఎస్సైలు, ఆర్ఐలు సీతారామి రెడ్డి, రమణారెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
