తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, దోర్నాల నుండి శ్రీశైలం వరకు ఉన్న ఘాట్ రోడ్డులో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఇన్చార్జి ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. తెలిపారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు, హైవే పేట్రోలింగ్ వాహనాలు, టోయింగ్ వెహికల్స్ సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. భద్రతా చర్యలు & ట్రాఫిక్ నియంత్రణ: ఘాట్ రోడ్డులో అనుభవం ఉన్న డ్రైవర్ల వాహనం నడపాలి. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి ట్రాఫిక్కు ఆటంకం కలిగించరాదు. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయబడింది. రద్దీ సమయాల్లో అదనపు పోలీస్ సిబ్బందిని మోహరించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తారు.భారీ వాహనాల రాకపోకలను నియంత్రించి, వాటికి నిర్దిష్ట సమయాలు కేటాయించబడతాయి. ప్రమాదాలను నివారించేందుకు హెచ్చరిక బోర్డులు, సూచికలు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు విధుల్లో ఉంటాయి.
ప్రయాణికులకు సూచనలు:
ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలి.
ఘాట్ రోడ్డులో అతి వేగం, ఓవర్టేకింగ్ పూర్తిగా నివారించాలి.
అనవసరంగా రోడ్డు పక్కన వాహనాలు నిలిపి ట్రాఫిక్కు అంతరాయం కలిగించరాదు.
నైపుణ్యం కలిగిన డ్రైవర్లతోనే ప్రయాణం చేయాలి.
వాహనాల బ్రేకులు, టైర్లు, ఇంజిన్ పరిస్థితి ముందుగా తనిఖీ చేసుకోవాలి.
పోలీసు అధికారులు, సిబ్బంది సూచనలను గౌరవించి సహకరించాలి.ప్రయాణికులు, భక్తులకు ట్రాఫిక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని మహాశివరాత్రి వేడుకలను శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.