తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పోలీసులు పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు మరియు వివిధ ప్రజా ప్రదేశాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో సైబర్ నేరాల నివారణ, OTP మోసాలు, ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ, మహిళలు మరియు చిన్నారుల భద్రత, మహిళలపై నేరాల నివారణ, బాల్య వివాహాల దుష్పరిణామాలు, ఈవ్టీజింగ్ నివారణ, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, POCSO చట్టం, కొత్త క్రిమినల్ చట్టాలు, రోడ్డు భద్రతా నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాలు (గంజాయి) వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు శక్తి యాప్ వినియోగం వంటి అంశాలపై ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.సైబర్ నేరస్థులు ఫోన్ కాల్స్, మెసేజ్లు, నకిలీ లింకుల ద్వారా OTPలు, బ్యాంకు వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు, OTPలు లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.మహిళలు, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. అలాగే మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని ప్రజలకు సూచించారు.ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం ద్వారా సురక్షితమైన, నేరరహిత సమాజ నిర్మాణమే పోలీసుల లక్ష్యమని మార్కాపురం జిల్లా పోలీసులు తెలిపారు.