పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో కేక్ కటింగ్.. మహిళలకు చీరల పంపిణీ, అన్నదానం
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సింగరాయకొండలో కూటమి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, దివ్యాంగ సోదరీ సోదరుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.సింగరాయకొండ మండల కేంద్రంలోని గంజివారి కళ్యాణ మండపంలో జనసేన పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ఐనాబత్తిన రాజేష్, మాజీ ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. సింగరాయకొండ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య మహిళా కార్మికులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారి చేతుల మీదుగా కేక్ కట్ చేయించి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం పంచాయతీ కార్మిక మహిళలు, జనసేన పార్టీ వీర మహిళలు, అక్కచెల్లెళ్లకు చీరలు పంపిణీ చేశారు. దివ్యాంగ సోదరీ సోదరులు, జనసైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ వేడుకల్లో జనసేన పార్టీ కొండేపి నియోజకవర్గ మాజీ సమన్వయ కార్యకర్త కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమ విజయవంతానికి సహకరించిన షణ్ముఖి, హర్షతో పాటు జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, దివ్యాంగ సోదరీ సోదరులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ ఐనాబత్తిన రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు.మరోవైపు మూలగుంటపాడు గాంధీ బొమ్మ వద్ద జనసేన నాయకులు అడుసుమల్లి సుధాకర్, ఖాజా హుస్సేన్, చాంద్ భాషా ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జనసేన జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు బలమైన మద్దతు ఉన్న ప్రాంతాల్లో పార్టీ తరఫున గట్టిగా పోటీ చేస్తామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, ప్రజలకు భరోసాగా నిలుస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని నాయకులు ఆకాంక్షించారు.
