మిస్సింగ్ కేసులపై మార్కాపురం జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ గారు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి, పలు అంశాలపై పోలీస్ అధికారులను ఆరా తీసి పలు సూచనలు, సలహాలు తెలియజేసారు.మిస్సింగ్‌ కేసుల విచారణలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఎవరైనా కనిపించకుండా పోయారని ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత వ్యక్తి ఫోటో, వివరాలను అన్ని పోలీస్‌ స్టేషన్లకు పంపించి శీఘ్రంగా గాలింపు చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా మిస్సింగ్‌ కేసుల ఛేదన కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమన్వయంతో పనిచేయాలన్నారు.మిస్సింగ్‌ కేసులను మతిస్థిమితం లేని వ్యక్తులు, చిన్నారులు, వృద్ధులు, బాలికలు, యువతులు, మహిళలు, పురుషులు వంటి విభాగాల వారీగా గుర్తించి విచారణ చేపట్టాలని పేర్కొన్నారు. అదృశ్యమైన వారి ఆచూకీ త్వరగా కనుగొనేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.మిస్సింగ్‌ కేసుల్లో ప్రారంభ దశలోనే వేగంగా దర్యాప్తు చేపడితే బాధితులను త్వరగా గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. కావున మిస్సింగ్ కేసుల్లో అలసత్వం వహించవద్దని అధికారులను జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.వివిధ దశల్లో పెండింగ్ ఉన్న కేసుల గురించి అధికారులను ఆరా తీశారు. ఆయా కేసుల దర్యాప్తు, పురోగతి, ముద్దాయిల అరెస్ట్, చార్జిషీటు దాఖలు చేసే విషయాలలో అధికారులకు తగిన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కేసులలో దర్యాప్తు త్వరితగతిన పూర్తిచేసి నిర్ణిత వ్యవధిలో కోర్ట్ లో చార్జిషీట్ లను దాఖలు చేసి, నిందితులకు శిక్ష పడే విధంగా, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రమాద ప్రాంతాల్లో ఇంకా హెచ్చరిక బోర్డులు, కుంభాకార దర్పణాలు, స్పీడ్ చెకింగ్, వాహన తనిఖీలు, బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు డ్రంకన్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ఎస్పీ గారు ఆదేశించారు. ఓవర్‌లోడింగ్, మైనర్ డ్రైవింగ్‌పై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, హెల్మెట్–సీట్‌బెల్ట్ వినియోగంపై అవగాహన పెంచాలని, అదేవిధంగా ముఖ్య కూడలిలో పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం ద్వారా కూడా అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా సైబర్ నేరాలు, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు, కొత్త చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు.ఎవరైనా జిల్లా వ్యాప్తంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుచున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ దేవ ప్రభాకర్, మార్కాపురం జిల్లా సీఐలు అల్తాఫ్ హుస్సేన్, అజయ్ కుమార్,సురేష్ , రాజేష్ కుమార్, అస్సన్, మల్లికార్జున రావు,రామకోటయ్య, ఎస్సైలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *