తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సాఫీగా రాకపోకలు సాగేందుకు ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసులు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యత, ప్రయాణికుల భద్రత, రోడ్లపై క్రమశిక్షణతో వ్యవహరించాల్సిన అవసరంపై విస్తృతంగా అవగాహన కల్పించారు.ఆటో డ్రైవర్లు నిర్దేశిత ప్రదేశాల్లోనే వాహనాలను నిలిపి ఉంచాలని, ప్రయాణికులను ఎక్కించే, దించే సమయంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు రోడ్డు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు.అలాగే బస్టాండ్ పరిసరాల్లో దుకాణాల ముందు వస్తువులు ఉంచడం లేదా రహదారిపై ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్న నేపథ్యంలో వ్యాపారులతో సమావేశమై రోడ్లను ఖాళీగా ఉంచాలని, ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించవద్దని సూచించారు. ట్రాఫిక్ జామ్లను నివారించేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.ప్రజల భద్రత, సౌకర్యవంతమైన రాకపోకల కోసం ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు తెలిపారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు.