తొలి శుభోదయం న్యూస్ కంభం :-
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విద్యాభ్యాసంలో అవసరమైన ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎంఆర్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ సత్తార్ , స్కూల్ అసిస్టెంట్ నూర్జహాన్ బేగం, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఎంఆర్ కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎంఈవో అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అందజేస్తున్న ఎంఆర్ కిట్లు వారి విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడంతో పాటు మానసిక, శారీరక వికాసానికి దోహదపడతాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సౌకర్యాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని పిల్లల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
ఉపాధ్యాయురాలు నూర్జహాన్ బేగం మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిలోనూ దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే ఉపాధ్యాయుల బాధ్యతని పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు అవసరమైన విద్యా పరికరాలు అందించడం ద్వారా అభ్యాసంలో ఆసక్తి పెరిగి, స్వయం సమర్థతతో ముందుకు సాగే అవకాశం కలుగుతుందన్నారు. విద్యార్థులకు ప్రేమ, ప్రోత్సాహం, ఓర్పుతో కూడిన సహకారం అందించినప్పుడే వారు ఉన్నత లక్ష్యాలను సాధించగలరని చెప్పారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తూ, వారి భవితకు బాటలు వేసి,నిరంతరం కృషి చేస్తున్న ఉపాధ్యాయురాలు నూర్జహాన్ బేగం సేవలు అభినందనీయమని కొనియాడారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.