తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల పరిధిలో ఆగస్టు 15వ తేదీకి ముందు నిర్వహిస్తున్న వృక్షారోపణ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో 100 మొక్కలు నాటి పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమానికి సింగరాయకొండ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ వి. లీల శ్యాంసుందరి హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.కోర్టు ప్రాంగణాల్లో పచ్చదనం పెంపొందించడం వల్ల న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు, పోలీసు సిబ్బంది, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.కోర్టు ప్రాంగణంలో నాటిన మొక్కలను నిరంతరం సంరక్షించి వాటి పెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
ఒక మొక్క – ఒక భవిష్యత్తు, మన కోర్టు ప్రాంగణం – మన పచ్చదనం – మన బాధ్యత అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు మన కోర్టులో పచ్చదనం పెంపొందించడం మనందరి బాధ్యత అన్నారు. అదేవిధంగా కార్యదర్శి బక్కమంతుల వెంకటేశ్వర్లు, న్యాయవాదులు చిట్టిబోయిన రాఘవేంద్రరావు, రాయి రమేష్, మోరుబోయిన వంశీ,సంజీవరెడ్డి,పంతగాని వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు,శ్రీలక్ష్మి, బార్ అసోసియేషన్ సభ్యులు , కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
