పైడిపాడు గ్రామంలో ఆపరేషన్ వజ్ర ప్రహార్
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, జరుగుమల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై పి భాగ్యరాజ్ మరియు సిబ్బంది ఆదివారం జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడిపాడు గ్రామంలో ఆపరేషన్ వజ్రపహార్” కార్యక్రమంలో భాగంగా కార్డన్ సెర్చ్ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు పైడిపాడు గ్రామ పరిసర ప్రాంతాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు, పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలలో భాగంగా సరైన పత్రాలు లేని 8 మోటార్ సైకిళ్లు మరియు 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గ్రామ పరిసరాల్లో గంచాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, రవాణా మరియు సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక నిఘా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఒంగోలు ఈగల్ టీం మరియు పోలీసు సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మాదకద్రవ్యాలు కలిగి ఉండడం, వినియోగించడం మరియు సరఫరా చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, వాటి వలన కలిగే అనర్ధాలను వివరించారు. అలాంటి కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే 1972 నంబర్కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. హెల్మెట్ మన ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని, మన ప్రాణం మన కుటుంబానికి ఎంతో విలువైనదని, చిన్న నిర్లక్ష్యం కుటుంబాలను విషాదంలోకి నెట్టవచ్చని ప్రజలకు వివరించారు.అలాగే మహిళలపై జరిగే నేరాలు, వేధింపులు మరియు POCSO చట్టంపై ప్రజలకు, యువతకు అవగాహన కల్పించారు. మహిళలను వేధించడం నేరమని, అలాంటి కేసుల్లో కఠినమైన శిక్షలు ఉంటాయని తెలియజేశారు.ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలపై కూడా ప్రజలను అప్రమత్తం ఉండాలని,.తెలియని వ్యక్తులకు OTPలు చెప్పకూడదని, అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయవద్దని, ఆన్లైన్ మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.చివరిగా వేసవి కాలంలో దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నందున బంగారు ఆభరణాలు, నగదు మరియు విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని, ప్రయాణాల సమయంలో ఇళ్లకు భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా గ్రామ ప్రజలు మరియు యువతతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ ఆర్. ఆర్ శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ శ్రీహరి, జరుగుమల్లి ఎస్సై భాగ్యరాజ్ , టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వర రావు గారు, ఈగల్ టీం సిబ్బంది మరియు గ్రామ ప్రజలు , యువకులు పాల్గొన్నారు.
